కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో ఒక ప్రయాణికుడికి ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. తన మతం కారణంగానే క్యాబ్ డ్రైవర్ ప్రయాణాన్ని నిరాకరించాడని ఆరోపిస్తూ ఒక ప్రయాణికుడు పంచుకున్న ఆడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఘటన మార్చి 21న ఈద్ పండుగ రోజున జరిగినట్లు తెలుస్తోంది. జైన్ అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఈ 16 సెకన్ల ఆడియోను పోస్ట్ చేస్తూ తనకు పండుగ పూట ఎదురైన పరిస్థితిని వివరించారు.
వైరల్ అవుతున్న 16 సెకన్ల ఆడియో క్లిప్లో డ్రైవర్ (Rapido driver) మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ‘నా వాహనంలో ముస్లింలకు అనుమతి లేదు’ అని డ్రైవర్ సమాధానం ఇచ్చారు. ప్రయాణికుడు ఆశ్చర్యంతో ‘నేను ముస్లింనని నన్ను ఎక్కించుకోనంటున్నారా?’ అని ప్రశ్నించగా, అవునని బదులిస్తూనే ‘ఇది నీ తండ్రి వాహనం కాదు’ అంటూ డ్రైవర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఆడియో బయటకు రావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై రాపిడో సంస్థ స్పందిస్తూ ఇది విచారకరమైన విషయమని పేర్కొంది. తమ ప్లాట్ఫారమ్లో ఇలాంటి వివక్షకు చోటు లేదని ఏ కారణం చేతనైనా సేవలను నిరాకరించడం తమ నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. బాధితుడితో మాట్లాడి తమ పూర్తి మద్దతును ప్రకటించామని సదరు డ్రైవర్పై తగిన చర్యలు తీసుకుంటామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

