కలం, కరీంనగర్ బ్యూరో: ఎస్ఆర్ఎస్పి కాకతీయ కాల్వ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన నీటిపారుదల శాఖపై రంగారెడ్డి కోర్టు (Rangareddy Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంకటేశ్వర ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అనే సంస్థ సుమారు రూ. 16 కోట్ల విలువైన పనులను పూర్తి చేసినప్పటికీ, వాటి బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. గతంలో బిల్లులు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినా అధికారులు స్పందించకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది.
న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయని కారణంగా ఎల్ఎండి, పోచంపాడు కార్యాలయాల్లోని ఆస్తులను జప్తు చేయాలని న్యాయమూర్తి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా రూ. 50 లక్షల విలువైన ఫర్నిచర్తో పాటు 24 ఏసీలు, 2 కార్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.

