కలం, మహబూబ్నగర్ బ్యూరో: పోక్సో (POCSO) కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ మహబూబ్నగర్ ప్రత్యేక పోక్సో, లైంగికదాడి కేసుల విచారణ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు.. బాలానగర్ మండలం మోతీఘన్పూర్ గ్రామానికి చెందిన పస్పుల నందు (29)పై నవాబ్పేట పీఎస్లో పోక్సో కేసు నమోదైంది.
ఈ కేసుకు (POCSO) సంబంధించి విచారణ పూర్తి కావడంతో న్యాయమూర్తి తుది తీర్పు వెల్లడించారు. నందు నేరం చేసినట్టు రుజువు కావడంతో అతడికి కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.20,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తమన్ రాజరాజేశ్వరి తీర్పు ఇచ్చారు.
ఈ కేసును దర్యాప్తుచేసి సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో నిరూపించడంలో కీలకపాత్ర పోషించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం జాన్, మహబూబ్నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, నవాబుపేట్ పూర్వ ఎస్సై విక్రమ్, కోర్టు లైజన్ అధికారులు బాలకృష్ణ (ఏఎస్ఐ), కృష్ణయ్య (పీసీ), శంకర్ (పీసీ), రహీం (పీసీ), సీడీఓ విజయ్ కుమార్ (పీసీ)లను జిల్లా ఎస్పీ డీ జానకి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో జిల్లా పోలీస్శాఖ అత్యంత కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి కేసును శాస్త్రీయ దర్యాప్తుతో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
Read Also: తెలంగాణ కేబినెట్లో మార్పులు.. కీలక మంత్రులు ఔట్?
Follow Us On: Instagram

