కలం, వెబ్ డెస్క్: కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు (Ramchander Rao) హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో దేశవ్యాప్తంగా సర్ఫేస్ కోల్ (నేల బొగ్గు), లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు రూ.37,500 కోట్ల విలువైన భారీ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ను సాధించాలన్న దేశ బృహత్తర లక్ష్యానికి అనుగుణంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం గొప్ప ఊతాన్నిస్తుందని చెప్పారు. దేశంలోని బొగ్గు వనరులను విలువైన, స్వచ్ఛమైన ఇంధనాలుగా, పారిశ్రామిక ఉత్పత్తులుగా కేంద్రం మార్చనుందని తెలిపారు.
ఇంధన భద్రతను పటిష్టం చేయడంలో, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో, అలాగే ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఈ చొరవ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం తీసుకువస్తున్న ఈ స్కీం భారీ పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు, పారిశ్రామిక వృద్ధికి కొత్త మార్గాలను సుగమం చేయడమే కాకుండా.. స్వయం సమృద్ధి, అభివృద్ధి చెందిన భవిష్యత్తు దిశగా సాగుతున్న దేశ ప్రయాణానికి మరింత శక్తినిస్తుందని చెప్పారు.

