కలం , మహబూబ్ నగర్ బ్యూరో: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో బొలెరో వాహనం బోల్తా పడిన ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా, 10 మంది గాయపడిన సంఘటన బుధవారం మహబూబ్ నగర్ (Mahbubnagar) కలెక్టరేట్ ఎదుట భూత్పూర్ రహదారి పై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకద్ర నియోజకవర్గంలోని దమగ్న పూర్ గ్రామం నుంచి భూత్పూర్ మండలం కొత్త మొల్గర గ్రామంలో పెళ్లికి వెళ్లేందుకు బొలెరో వాహనంలో 30 మంది బయలు దేరారు.పెళ్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట వీరు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.
డ్రైవర్ వేగాన్ని నియత్రించలేక డివైడర్ ను ఢీ కొట్టడంతో వాహనం బోల్తా పడిందని స్వల్ప గాయాలతో బయటపడ్డవారు తెలిపారు. ఈ ప్రమాదం లో ఓ బాలుడు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. బాలుడి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు. ఈ ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

