కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఏకైక విశ్వసనీయ ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామ్చందర్రావు (Ramchander Rao) ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బర్కత్పురాలోని సిటీ బీజేపీ కార్యాలయంలో మంగళవారం రేఖా శర్మతో కలిసి జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని పార్టీ జిల్లా అధ్యక్షులు, మోర్చా అధ్యక్షులు, ముఖ్య నాయకులతో రామ్ చందర్ రావు కీలక సమావేశం నిర్వహించారు. బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, సంస్థాగత నిర్మాణం మరియు రాబోయే కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ సుపరిపాలన, అభివృద్ధి, ‘దేశమే ప్రథమం’అనే ఆశయాలను సమిష్టి కృషితో ప్రతి గడపకూ చేర్చడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ప్రధాని మోదీ 12 ఏళ్ల సుపరిపాలనలో నిర్ణయాత్మక నాయకత్వం, అభివృద్ధి ఆధారిత పాలనతో దేశం సాధించిన అద్భుత ప్రగతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఎంతో ఆశతో చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తిగా ఉనికి కోల్పోయిందని విమర్శించారు. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు “మేరా భారత్, మేరా యోగ్దాన్” జాతీయ కార్యక్రమంలో కార్యకర్తలంతా పూర్తి అంకితభావంతో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

