కలం, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పినట్లుగానే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తీపి కబురు అందించింది. ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, వారిమీద ఆధారపడుతున్నవారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య చికిత్స అందించేలా హెల్త్ స్కీమ్ (Free Health Scheme) త్వరలో అందుబాటులోకి రానున్నది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేసింది. పేదలకు ఆరోగ్యశ్రీ సేవలందించడానికి ట్రస్టు ఉన్నట్లుగానే ఉద్యోగుల హెల్త్ అవసరాలకు కూడా స్పెషల్ ట్రస్ట్ ఏర్పాటైంది.
ఇకపైన ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ఈ ట్రస్టు ద్వారానే అమలు కానున్నది. ఇందుకోసం ఈ స్కీమ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వివరాలను ఈ నెల 31వ తేదీ లోగా సేకరించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. ఈ వివరాలన్నింటినీ సేకరించి ట్రస్టుకు అందించే బాధ్యతను ఆయా డిపార్టుమెంట్ల హెచ్ఓడీలకు ప్రభుత్వం అప్పగించింది. ఏయే వివరాలు అవసరమో నిర్దిష్ట ఫార్మాట్ను కూడా రూపొందించింది. రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి రెండు రోజుల ముందే ఈ కసరత్తు మొదలుకావడం గమనార్హం.

