కలం, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామ్చందర్ రావు (Ramchander Rao) ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో మోర్చాల అధ్యక్షులు, ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణ, ఐక్యతతో బూత్ స్థాయిలో పని చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీలో డీలిమిటేషన్ తర్వాత వార్డుల సంఖ్య 300కి పెరిగిందని, ఆ సంఖ్య 350 వరకు పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని.. ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీశ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడంతో తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని వ్యాఖ్యానించారు.

