కలం, వెబ్ డెస్క్: అమరావతి చట్టబద్ధత బిల్లుపై (Amaravati Bill) రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రక సందర్భం తనతో పాటు, 5 కోట్ల ఏపీ ప్రజలకు ఎంతో ప్రత్యేకమన్నారు. ఇన్నేళ్లకు ఏపీ రాజధానిపై స్పష్టత వస్తున్నదని భావోద్వేగానికి గురయ్యారు. ఈ బిల్లు ప్రవేశపెడుతున్నందుకు తెలుగు ప్రజలంతా గర్వంగా భావిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం ఏపీని పరిపాలించిన కాలంలో ఏపీలో చీకటి రోజులు నడిచాయన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి 50 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందన్నారు. గత వైసీపీ (YCP) ప్రభుత్వం ఏపీకి రాజధాని లేకుండా చేసిందని విమర్శించారు. మూడు రాజధానుల పేరులో ప్రజల్లో గందరగోళం సృష్టించారన్నారు. అమరావతిని నాశనం చేసేందుకు, రాష్ట్రంలో స్థానిక గొడవలు సృష్టించేందుకు ఈ తరహాలో వ్యవహరించారని ఆరోపించారు. రాజధాని మా ప్రాంతానికి కావాలంటే మా ప్రాంతానికి కావాలంటూ ప్రజలు కొట్టుకునే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు.
అమరావతి గురించి మాట్లాడుకుంటే అక్కడి రైతులు, మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో మూడు పంటలు పండుతున్న భూములను రైతులు త్యాగం చేశారన్నారు. 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూములను రైతులు రాజధాని కోసం ఇచ్చారని, విజనరీ లీడర్ చంద్రబాబు వల్లే రాజధాని భూసేకరణ సాధ్యమైందని స్పష్టం చేశారు. ఇక అమరావతికి దేశంలో వైసీపీ తప్ప అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
Read Also: రాజ్యసభలో అమరావతి బిల్లు.. వైఎస్సార్సీపీ సభ్యుల వాకౌట్
Follow Us On: Facebook

