కలం, వెబ్ డెస్క్ : ఏపీ రాజధానిగా అమరావతి(Amaravati) చట్టబద్ధత బిల్లు పై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. దీంతో ఈ బిల్లుపై లోక్సభలో వ్యతిరేకించిన విధంగానే రాజ్యసభలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అదే వైఖరిని చూపించారు. చర్చలో భాగంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అమరావతి చట్ట బద్ధత బిల్లులో ఏపీ ప్రత్యేక హోదా అంశంపై స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. రాజ్యాంగంలో రాజధాని అంశం ఎక్కడ ఉందని ఎంపీ ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం అమరావతి పేరిట డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. రైతుల వద్ద నుంచి రాజధాని అభివృద్ధికి ఇప్పటికే 50 వేల ఎకరాలు సేకరించగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఆలోచన చేస్తున్నారని తెలిపారు.రాజధానిలో మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అవుతుందని చెబుతున్నారని, కేవలం రెండేళ్లలోనే 3 లక్షల 40 వేల కోట్లు అప్పు చేశారని ఫైర్ అయ్యారు. ఇలాగే కొనసాగితే రూ.14 లక్షల కోట్లకు అప్పు చేరుతుందని చెప్పారు. అమరావతి అతిపెద్ద కుంభకోణమని.. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.

