కలం, వెబ్ డెస్క్ : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ (Aman Preet Singh) మరోసారి డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ పరిధిలో వెలుగుచూసిన తాజా డ్రగ్స్ ఉదంతంలో అమన్ పేరును పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ ముఠాల ఆటకట్టించేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో రంగంలోకి దిగింది. తాజాగా మాసబ్ ట్యాంక్ (Masab Tank) ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ విచారణలో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) సోదరుడు అమన్ ప్రీత్ సింగ్కు ఈ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసులో అమన్ పేరును ఏ7గా చేర్చి కేసు నమోదు చేశారు.
ఈగల్ టీమ్ గాలింపు..
డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఇద్దరు ప్రధాన వ్యాపారస్తుల నుంచి అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితుల నుంచి 43 గ్రాముల కొకైన్, ఎండీఎంఏ (MDMA) వంటి ఖరీదైన డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమన్ తన స్నేహితులతో కలిసి ఈ మత్తు పదార్థాలను వినియోగించడమే కాకుండా, పంపిణీకి కూడా సహకరిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
పరారీలో అమన్ సింగ్..
ఈ కేసుపై వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అమన్ ప్రీత్ సింగ్ (Aman Preet Singh) ప్రస్తుతం పరారీలో ఉన్నారని, అతని కోసం ఈగల్ టీమ్ ముమ్మరంగా గాలిస్తోందని వెల్లడించారు. అమన్ కేవలం ఈ కేసులోనే కాకుండా, గతంలో నమోదైన నార్సింగి డ్రగ్స్ కేసులో కూడా నిందితుడిగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అమన్ సింగ్తో పాటు అతని స్నేహితులు మరికొందరు కూడా పరారీలో ఉన్నారు.
గతంలోనూ కేసులు..
గత సంవత్సరం కూడా సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడిన దాఖలాలు ఉన్నాయి. విదేశీ పెడ్లర్ల నుంచి డ్రగ్స్ సేకరించి, నగరంలోని సంపన్న వర్గాలకు వీటిని చేరవేస్తున్న నెట్వర్క్లో అమన్ పాత్రపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి అరెస్టు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ వ్యవహారంలో మరిన్ని సినీ, వ్యాపార ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: బలహీనవర్గాలకు మోడీ వెన్నుపోటు : ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే
Follow Us On: Youtube


