కలం, వెబ్ డెస్క్ : కృష్ణా(Krishna) జిల్లా మచిలీపట్నం(Machilipatnam) లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొబ్బరితోట ప్రాంతంలో అనుమతి లేకుండా నిర్మించిన ఓ కట్టడాన్ని కూల్చి వేసేందుకు మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకోగా, స్థానికులు తీవ్ర నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, నిరసనకారులను బలవంతంగా అక్కడి నుంచి తొలగించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు (Perni Kittu) అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ విధుల్లో ఉన్న సీఐ పరమేశ్వరరావు(CI Parameswara Rao) తో ఆయనకు వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరిగి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
పోలీసులతో మర్యాదగా మాట్లాడాలని సీఐ సూచించగా, కిట్టు ఒక్కసారిగా స్వరం పెంచి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు మర్యాద ఇవ్వడమే ఎక్కువ.. నీవు ఏమి చేస్తున్నావో నాకు అన్నీ తెలుసు అంటూ కిట్టు మరింతగా మండిపడ్డారు. ఈ ఘటనతో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. దీనితో పోలీసులు జోక్యం చేసుకుని సీఐను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

