కలం, వెబ్ డెస్క్ : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం నెలకొంది. ఓ వైపు తీవ్రమైన వడగాల్పులతో భానుడు విరుచుకుపడుతుండడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు కొన్ని ప్రదేశాలలో వాన జల్లులు పడుతుండడంతో ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ (Rain Alert) జారీ చేసింది. దక్షిణ అంతర కర్ణాటక, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాలలో మూడు రోజుల పాటు వానలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయని హెచ్చరించింది. అటు రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చెట్ల కింద ఉండవద్దని, కరెంట్ స్తంభాలను తాకవద్దని సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

