కలం, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీ డీఎంకే (DMK Manifesto) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించేలా భారీ హామీలను ప్రకటించింది. ‘కలైంజర్ మహిళా ఉరిమై తిట్టం’ కింద ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచుతూ, ప్రతి అర్హులైన మహిళకు నెలకు రూ.2,000 చొప్పున అందిస్తామని సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. గతంలో ఉన్న రూ.1,000 మొత్తాన్ని రెట్టింపు చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తుందని పార్టీ పేర్కొంది.
సామాజిక భద్రత, విద్యారంగంపై కూడా డీఎంకే ప్రత్యేక దృష్టి సారించింది. వృద్ధాప్య పింఛన్లను గణనీయంగా పెంచుతామని, అలాగే నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు పంపిణీ చేస్తామని ప్రకటించింది. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతోపాటు, ల్యాప్టాప్ల పంపిణీ ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తుందని మేనిఫెస్టోలో స్టాలిన్ స్పష్టం చేశారు.
వీటితో పాటు మధ్యతరగతి, పేద వర్గాలకు ఊరటనిచ్చేలా ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత విస్తరిస్తామని డీఎంకే హామీ ఇచ్చింది. వ్యవసాయ రంగానికి, గృహ అవసరాలకు సంబంధించి విద్యుత్ రాయితీలను కొనసాగిస్తూనే, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. రాష్ట్ర అభివృద్ధిని ‘ద్రావిడ మోడల్ 2.0’ పేరుతో ముందుకు తీసుకెళ్తామని, ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని స్టాలిన్ ప్రకటించారు.

