కలం, కరీంనగర్ బ్యూరో: గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం రైల్వేస్ – సింగరేణి సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు జట్లతో క్రికెట్ టోర్నమెంట్ (Railway Singareni Cricket Tournament) ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో GDK-11 గ్రూప్, GDK-1 గ్రూప్, సింగరేణి జట్టు, రైల్వే జట్టు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో రైల్వే జట్టు విజేతగా నిలవగా, సింగరేణి GDK-1 జట్టు రన్నరప్ గా నిలిచింది.
ముఖ్య అతిథులుగా RG-1 జీఎం లలిత్ కుమార్, 11A గ్రూప్ ఏజెంట్ చిలక శ్రీనివాస్, రైల్వే ఐఆర్ఎస్ అధికారి శుభం పట్టుసరియా, పర్సనల్ ఆఫీసర్ హనుమంతరావు, ఎఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రీనివాస్ తో పాటు టోర్నమెంట్ ఆర్గనైజర్లు మల్లికార్జున్, జాన్ కెనడి, రాజ్ కుమార్, హరికృష్ణ, సంతోష్ పాల్గొన్నారు. అనంతరం విజేతలు, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొన్న అన్ని జట్లను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి క్రీడా టోర్నమెంట్లు నిర్వహించాలని, వాటికి సంస్థ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ టోర్నమెంట్ క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు రైల్వే–సింగరేణి ఉద్యోగుల మధ్య స్నేహభావాన్ని మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు.

