కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఉత్తరాఖండ్ పర్యటన అనుకోకుండా రద్దయింది. షెడ్యూల్ ప్రకారం పంత్నగర్ చేరుకున్న ఆయన, అక్కడ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల తదుపరి ప్రయాణాన్ని కొనసాగించలేకపోయారు. అల్మోరా, పౌరీ గర్వాల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ప్రయాణానికి పైలట్ నిరాకరించారు.
రాష్ట్రానికి సంబంధించిన స్థానిక సమస్యలపై ఇక్కడి ప్రజలతో పాటు, ముఖ్యంగా మాజీ సైనికులతో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గుర్తుచేశారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా పర్యటనను నిలిపివేయక తప్పలేదని ఆయన వివరించారు. ఈ పర్యటన రద్దయినప్పటికీ, అతి త్వరలోనే తాను మళ్లీ ఉత్తరాఖండ్కు వస్తానని, ఇక్కడి ప్రజలను కలుసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.

