కలం, స్పోర్ట్స్ : నార్వే చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద (Praggnanandhaa) సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మేగ్నస్ కార్ల్సన్ను రెండోసారి ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం టోర్నమెంట్లో రెండు రౌండ్లు మిగిలి ఉండగా.. ప్రజ్ఞానంద 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో అదానీ స్పోర్ట్స్లైన్ ‘గర్వ్ హై’ చొరవ మద్దతుతో బరిలోకి దిగిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శన చేశారు.
గతంలో కార్ల్సన్పై వైట్ పీసెస్తో గెలిచిన ఆయన.. ఎనిమిదో రౌండ్లో బ్లాక్ పీసెస్తో ఆడి మరోసారి విజయం సాధించారు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన కార్ల్సన్ను ఒకే ఏడాదిలో రెండుసార్లు క్లాసికల్ చెస్లో ఓడించిన రెండో భారతీయ ఆటగాడిగా ప్రజ్ఞానంద రికార్డుకెక్కారు. ఇంతకుముందు విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే ఈ ఘనత సాధించారు. ప్రజ్ఞానంద సాధించిన ఈ అరుదైన విజయంపై అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ స్పందించారు.
ప్రజ్ఞానంద ఆటతీరు అసాధారణంగా ఉందంటూ అభినందనలు తెలిపారు. కార్ల్సన్పై ఈ రెండు విజయాలు ప్రజ్ఞానందలోని ఆత్మవిశ్వాసాన్ని, పరిణతిని, పోటీ తత్వాన్ని చూపిస్తున్నాయని కొనియాడారు. ఆయన ప్రదర్శన కొత్త తరం భారతీయ ఆటగాళ్లకు స్ఫూర్తిని ఇస్తుందని, ప్రపంచ వేదికపై భారత చెస్ ఎదుగుదలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. మిగిలిన రౌండ్లలో కూడా ఆయన విజయం సాధించాలని ప్రణవ్ అదానీ ఆకాంక్షించారు.

