కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేకపోతుందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా విమర్శించారు. “మొన్న నీట్, సీబీఎస్ఈ, ఎస్సెస్సీ, ఈరోజు సీయూఈటీ.. నాలుగు పరీక్షలు, కోటి మంది విద్యార్థులు. ఒక్కటీ కూడా నిజాయితీగా నిర్వహించడం లేదు. విశ్వ గురు అని చెప్పుకునే వ్యక్తి.. ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేని స్థితికి దిగజారిపోయారు. మొత్తం విద్యా వ్యవస్థనే మోదీ నాశనం చేసేశారు. మీరు ఏ తరాన్ని అయితే నాశనం చేస్తున్నారో.. వారే మిమ్మల్ని జవాబుదారీగా నిలబెట్టే పరిస్థితి వస్తుంది” అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
సాంకేతిక సమస్యలతో నిలిచిన పరీక్ష..
విశ్వ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ను (CUET–UG) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు రెండు సెషన్లలో నిర్వహిస్తోంది. ఉదయం అంతా సాఫీగానే జరిగినా.. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన పరీక్షలో మాత్రం సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీనిపై అధికారిక ప్రకటన చేసిన ఎన్టీఏ.. పరీక్షను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. విద్యార్థులు ఆందోళన చెందవద్దని.. తగినంత సమయం ఇస్తామని స్పష్టం చేసింది.

