కలం, వెబ్డెస్క్: ప్రార్థనా మందిరాల్లో మితి మీరుతున్న లౌడ్ స్పీకర్ల వినియోగంపై ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) డీజీపీకి లేఖ రాశారు. ప్రార్థనా స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా, నిరంతరాయంగా మైకులు వాడటం వల్ల విద్యార్థులు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనల చట్టం , సుప్రీంకోర్ట్ ఆదేశాల ప్రకారం లౌడ్ స్పీకర్ల వినియోగంపై కఠిన ఆంక్షలు ఉన్నాయని, తన నియోజకవర్గంలో ఇప్పటికే వీటిని అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు కఠినతరం చేయాలని ఆయన కోరారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 270, 292, 223 కింద కేసులు నమోదు చేయాలని రఘురామ సూచించారు. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం నిబంధనలు అతిక్రమిస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన గుర్తు చేశారు. అనధికారికంగా వినియోగిస్తున్న సౌండ్ సిస్టమ్లు స్వాధీనం చేసుకోవాలని, శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించే విధంగా పోలీసులు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని ఆయన డీజీపీని కోరారు. ఈ లేఖ ప్రతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులకు కూడా పంపించారు.

