కలం, వెబ్ డెస్క్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ (Mohan Naik) ఇంట్లో ఏసీబీ (ACB) అధికారులు దాడులు నిర్వహించారు. మాదాపూర్లోని ఆయన నివాసం సహా మరో 14 ప్రాంతాల్లో ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మోహన్ నాయక్ సుమారు రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. మోహన్ నాయక్ బంధువుల ఇండ్లల్లో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి.
అధికార దుర్వినియోగానికి పాల్పడి కొన్ని ఎంపిక చేసిన కంపెనీలకే మోహన్ నాయక్ కాంట్రాక్టులు దక్కేలా చేసి అక్రమాస్తులు సంపాదించారని ఆరోపణలున్నాయి. అధికారుల తనిఖీల్లో భారీగా గోల్డ్ బిస్కెట్లు, ఆభరణాలు, వెండి వస్తువులు గుర్తించారు. వీటితో పాటు రూ.65 లక్షల నగదు, నిజామాబాద్ లో వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు, భారీగా లిక్కర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మోహన్ నాయక్ ఆదాయానికి మించి 300 రెట్లు అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం మోహన్ నాయక్ ఇళ్లల్లో దాడులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

