కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రచలం (Bhadrachalam) సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్లు కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఈ నెల 27, 28 తేదీలలో జరగనున్న ఉత్సవాలకు ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ తరపున పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే పార్కింగ్ స్థలాలు, కళ్యాణ మంటపం, సెక్టార్లు, లడ్డూ, తలంబ్రాల కౌంటర్ల వద్దకు భక్తులు సులభంగా చేరుకునే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్యూ ఆర్ కోడ్ ను, ఆన్లైన్ లింకును రూపొందించినట్లు తెలిపారు. https://ramanavami.4sightai.com/ లింకు ద్వారా శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలను తిలకించడం భక్తులకు సులభ తరం అవుతుందని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రెండు రోజులు పాటు భక్తులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆంక్షలకు భద్రాచలం (Bhadrachalam) పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

