కలం, వెబ్ డెస్క్: పంజాబ్, చండీగఢ్లో (Punjab-Chandigarh) భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. చండీగఢ్ సెక్టార్-43 బస్స్టాండ్ సమీపంలో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో లవ్ ప్రీత్ సింగ్ (19), జషన్ ప్రీత్ సింగ్ అలియాస్ జషన్ దీప్ (21), ప్రభ్ ప్రీత్ సింగ్ అలియాస్ ప్రభ్ (19) ఉన్నారు. వీరిలో ఇద్దరు తరన్తారన్కు, మరొకరు అమృత్సర్కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది సత్నామ్ సట్టాతో వీరికి సంబంధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పంజాబ్, చండీగఢ్లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

