కలం, వెబ్డెస్క్: ప్రతిపక్ష నేతల్ని మాట్లాడనివ్వకపోతే ఇక సభకు ఎందుకు రావాలి? అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ప్రశ్నించారు. లోక్సభ మంగళవారానికి వాయిదా పడిన అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఆమె విలేకరులతో మాట్లాడారు. దేశ, ప్రజాసమస్యలపై మాట్లాడే హక్కు ప్రతిపక్ష నేతకు ఉంటుందన్నారు. ప్రతిపక్ష నేతని సభలో మాట్లాడనివ్వకపోతే అది ప్రజాస్వామ్యమే కాదన్నారు. ‘ఇది అత్యంత బాధాకరం. మేం సభలోకి ఇలా వెళ్లి అలా రావాల్సి వస్తోంది. ప్రతిపక్ష నేత(Rahul Gandhi)ను సభలో మాట్లాడనివ్వకపోవడం దారుణం. ఇది ప్రజాస్వామ్య లక్షణం కాదు. మాట్లాడనివ్వకపోతే ఇక మనం సభకు వచ్చేది ఎందుకు? ’ అని ప్రియాంక ఆవేశంగా అన్నారు.
ప్రధాని సభకు రాకపోవడంపై మాట్లాడుతూ.. స్పీకర్ ఓం బిర్లాపై (Om Birla) ఏదో ఒత్తిడి ఉందని, అందుకే పీఎం తరఫున ఆయన మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. ‘కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధానిపై దాడి చేయాలనుకున్నారని చెప్పడం పూర్తి అసంబద్ధం. దానికి నేనే సాక్ష్యం. ఆ సమయంలో అక్కడ నాతో పాటు 11 మంది కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఉన్నారు. ఇలా మాపై ఆరోపణలు చేయడం సరికాదు. ఎందువల్లో ప్రధాని సభకు రావడం లేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి స్పీకర్ ఇలా మాట్లాడుతున్నారు’ అని ప్రియాంక (Priyanka Gandhi) ఆరోపించారు.
అంతకుముందు సభలో రాహుల్ను మాట్లాడనివ్వాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుపట్టారు. అయితే, ఏం మాట్లాడతారో ముందుగానే చెప్పాలంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు అనడంతో వివాదం రాజుకుంది. దీంతో సభ పలుమార్లు వాయిదా పడిన అనంతరం చివరిగా మధ్యాహ్నం మరోసారి సమావేశమైంది. అయితే, అప్పుడూ సభ జరిగేలా కనిపించకపోవడంతో రేపటికి వాయిదా పడింది.
స్పీకర్కు మహిళా ఎంపీల లేఖ..
ప్రధానిపై దాడికి ప్రయత్నించామంటూ తమపై ఆరోపణ చేయడం మీద కాంగ్రెస్ మహిళా ఎంపీలు స్పందించారు. ఈ విషయమై నేరుగా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తమపై చేసిన ఆరోపణ పూర్తిగా అసత్యం, నిరాధారమని ఆ లేఖలో స్పష్టం చేశారు. తమను కించపరచడానికే ఇలాంటి ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.
Read Also: కస్టోడియన్గా వ్యవహరించాలి… బ్యాంకులకు సుప్రీం ఆదేశం
Follow Us On: Sharechat


