కలం, వెబ్డెస్క్: కరీంనగర్ జిల్లాలో మూడు వేర్వేరు పార్టీలకు చెందిన ముగ్గురు కీలక నాయకులు ఒకే చోట సందడి చేశారు. దీనికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సోదరుడి కుమార్తె వివాహ వేడుక వేదికైంది. కరీంనగర్లోని వసుధ కన్వెన్షన్లో బండి సంజయ్ సోదరుడు శ్రవణ్ కుమార్తె వివాహం నేడు జరిగింది. ఈ వివాహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను గంగుల, పొన్నం తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసుకున్నారు.
కరీంనగర్ రాజకీయాల్లో ఈ ముగ్గురు నాయకులు కీలకంగా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్, బండి సంజయ్, బీజేపీ, గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీల్లో సుధీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నారు. ఒకానొక సమయంలో కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి వీరు ముగ్గురు పోటీ పడ్డారు. అయితే రాజకీయాలకు అతీతంగా ఇలా కుటుంబ వేడుకల్లో నాయకులు కలిసి మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

