కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు (Hyderabad Auto Drivers) శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్తో నడుస్తున్న ఆటోలను ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చుకునేందుకు కొత్త పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026కు ఆమోదం తెలుపుతూ.. మార్గదర్శకాలు జారీ చేసింది. మొదట విడతగా హైదరాబాద్ నగరం విస్తరించిన క్యూర్ పరిధిలో 18,766 ఆటోలను ఈవీలుగా మార్చడమే లక్ష్యమని అందులో పేర్కొన్నారు. ఇందుకోసం రూ.200 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించారు.
రెండు ఆప్షన్లతో..
కొత్త పథకంలో భాగంగా క్యూర్ పరిధిలోని ప్రతి ఆటో యజమానికి రెండు ఆప్షన్లతో గరిష్ఠంగా రూ.1.50 లక్షలు అందిస్తారు. ప్రస్తుతం ఉన్న ఆటోను ఈవీగా మార్చుకోవడం లేదా కొత్త ఎలక్ట్రానిక్ ఆటోను కొనుగోలు చేసుకోవచ్చు. ఒకవేళ ఆటోను ఈవీగా మార్చుకోవాలనుకుంటే మాత్రం ప్రభుత్వం సూచించిన నిర్దేశిత ఇంజిన్ మాత్రమే కొనుగోలు చేసి అమర్చుకోవాలి. లేదంటే ఎలక్ట్రానిక్ ఆటోనే కొనుగోలు చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రభుత్వం సూచించిన డీలర్ వద్దకు వెళ్లి పేరు నమోదు చేసి, వివరాలు సమర్పించి కొనుగోలు చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరాన్ని నెట్ జీరో కార్బన్ సిటీగా మార్చే లక్ష్యంతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.

