కలం, వెబ్డెస్క్: ప్రధాని మోడీ (PM Modi) ప్రజలకు భరోసా కల్పించాల్సంది పోయి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు మోదీ వస్తే రాష్ట్రానికి లాభం జరుగుతుందని ప్రజలంతా భావించారన్నారు. ప్రధానికి స్వాగతం పలికి సీఎం రేవంత్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పారు. ప్రధాన మంత్రి వచ్చి పెట్రోల్, డీజిల్ వాడవద్దు, బంగారం కొనవద్దు, వంట నూనె వాడవద్దు అంటున్నారని మండిపడ్డారు. ఒక ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం సరైందేనా? అని ప్రశ్నించారు. దేశంలో మంచి పరిపాలన అందిస్తున్నామని చెప్పి ప్రజల మీద భారం వేస్తున్నారని మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నడ్డా, బండి సంజయ్, కిషన్ రెడ్డి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తారన, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు 12 ఏళ్లలో ఏం చేశారో చెప్పి బీజేపీ నేతలు మాట్లాడాలని అన్నారు. సికింద్రాబాద్ టవర్ సర్కిల్ నిధుల్లో కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర వాటా ఎంత అనేదానిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. 29 రాష్ట్రాలకు ఎలా ఇస్తున్నారో తెలంగాణకు కూడా అలాగే ఇచ్చారన్నారు. తెలంగాణకు మౌలిక సదుపాయాలు, కేంద్రీయ సంస్థలు కావాలని కోరారు. పక్క రాష్ట్రం వాళ్లు ఎన్ని నిధులు అడుగితే అన్ని తీసుకుపోతున్నారని అన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు తెలంగాణకు ఏం నిధులు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని తెలంగాణపై వివక్ష చూపిస్తున్నారని పొన్నం (Ponnam) ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు పట్ల మోదీ, అమిత్ షా, పలువురు బీజేపీ ఎంపీలు వివక్ష పూరితంగా మాట్లాడుతున్నారన్నారు.
భద్రాచలం, కొండగట్టు, వేములవాడ , బాసర ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని పొన్నం అన్నారు. ప్రసాద్ స్కీమ్ కింద ఏ ఆలయాలకు ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు గోదావరి పుష్కరాలకు 2 వేల కోట్లు కేటాయించాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. తెలంగాణలోని దేవాలయాలపై ఎందుకు వివక్ష చూపిస్తారని నిలదీశారు. బీసీ హక్కుల గురించి అడగరని, దేవాలయాల అభివృద్ధి అడగరని, క్యూర్ ఏరియా అభివృద్ధి గురించి అడగరని అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని తెలంగాణకు వస్తే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటే పెద్ద కోడి గుడ్డు సున్నా ఇచ్చిపోయారని ఎద్దేవా చేశారు.
Read Also: రాష్ట్రాన్ని రెండుగా పంచుకున్న కేటీఆర్, హరీశ్రావు
Follow Us On : WhatsApp

