కలం, వెబ్డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Govt) ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట చెబుతూ సామాన్య ప్రజలను వంచిస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ ఎక్కిన తర్వాత బోడ మల్లన్న అనే చందంగా కేంద్ర నిర్ణయాలు ఉన్నాయని ఆయన ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్, యుద్ధాల సాకుతో వరుసగా నాలుగు రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని, గ్యాస్, ఇంధన ధరల పెరుగుదల కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు పరాకాష్ఠ అని మండిపడ్డారు.
“అచ్చే దిన్” అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ, నేడు ప్రతి రోజూ సామాన్యుడి బ్రతుకు భారంగా మార్చేసిందని పొంగులేటి ఆరోపించారు. దేశ ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని, తాను మాత్రం ధరలు పెంచుతానన్నట్లుగా ప్రధాని మోదీ తీరు ఉందని, ప్రజల కష్టాలు తీర్చాల్సింది పోయి కేంద్ర పెద్దలు బాధ్యత మరచి బోధనలు చేయడం “ఆడలేక మద్దెల ఓడు” అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఒకవైపు ధరల భారం మోపుతూ, మరోవైపు మాటలతో మాయ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. వెంటనే పెంచిన ఇంధన ధరలను తగ్గించి ప్రజలకు విముక్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

