కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ (Palwancha) లోని రాహుల్ గాంధీ నగర్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన పరిరక్షణ సంస్థ (TG REDCO)లో పనిచేస్తున్న డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకట రమణకు సంబంధించి, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ బృందాలు దాడులు చేశాయి.
సదరు ఇంజనీర్ తన అధికార పరిధిని దుర్వినియోగం చేస్తూ కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బుధవారం ఉదయం నుంచే రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు రాహుల్ గాంధీ నగర్లోని ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.
కేవలం పాల్వంచలోనే కాకుండా, సదరు అధికారికి సంబంధించి రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయని డీఎస్పీ రమేష్ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు లభ్యమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

