కలం, నల్లగొండ: ఈనెల 13న నిర్వహించనున్న పాలిసెట్- 2026 పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. పాలిసెట్- 2026 పరీక్ష నిర్వహణ విషయమై మంగళవారం అయన తన చాంబర్ లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పాలిసెట్-2026 పరీక్ష నిర్వహణకు గాను నల్గొండ జిల్లా(Nalgonda)లో మొత్తం 15 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేయడం జరిగిందని, నల్గొండ పట్టణంలో 13, నాగార్జునసాగర్ లో 2 కేంద్రాలు ఏర్పాటు చేశామని, పాలిసెట్ పరీక్షకు 5810 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని,పరీక్ష ఈ నెల 13 న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 వరకు ఉంటుందని తెలిపారు.
మరోవైపు పాలిసెట్ పరీక్ష సక్రమంగా నిర్వహించేందుకుగాను అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అడిషనల్ ఎస్పీ రమేష్ ను కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు తో పాటు, పేపర్ ను భద్రపరిచేందుకు ఎస్కార్ట్, అవసరమైన ఇతర భద్రత సౌకర్యాలను కల్పించాలని కోరారు. అదేవిధంగా పరీక్ష రోజున పరీక్షా కేంద్రాల పరిధిలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను, అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిధిలో బిఎన్ఎస్ 163వ సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. పరీక్ష రోజున ఆర్టీసీ అధికారులు అవసరమైనన్ని బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పాలిసెట్- 2026 నిర్వాహకులు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జిల్లా కో-ఆర్డినేటర్ సిహెచ్ నరసింహారావు, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య, ట్రాన్స్కో, ఇతర సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Read Also: నా కొడుకు నిప్పు… నిందలు వేసినవాళ్ళను వదిలిపెట్టను: బండి సంజయ్
Follow Us On: Sharechat

