కలం, వెబ్ డెస్క్ : కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య నెలకొన్న వివాదం ఇంకా సద్దుమణగకపోవడంతో స్థానికంగా హైటెన్షన్ కొనసాగుతోంది. ఈ వివాదంపై చర్చించేందుకు సోమవారం కలెక్టరేట్ వేదికగా అధికారుల సమక్షంలో అన్ని విషయాలను తేల్చుకుందామని ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. అయితే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కేవలం అసలు అంశాలను పక్కదారి పట్టించేందుకే ఇటువంటి సవాళ్లు విసురుతున్నారని వారు మండిపడుతున్నారు.
మరోవైపు నిన్న ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి నివాసంపై జరిగిన దాడిని బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో కామారెడ్డికి వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులను పోలీసులు ముందస్తుగా అడ్డుకుంటున్నారు. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు కామారెడ్డి (Kamareddy) వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా పలువురు బీజేపీ నేతలను గృహనిర్బంధం చేయడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఎక్కడికక్కడ పోలీసు పహారా పెరగడం, రెండు పార్టీల నేతలు వెనక్కి తగ్గకపోవడంతో కలెక్టరేట్ వద్ద ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.


