కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palvancha)లో సోమవారం పోలీసులు 300ల ఇళ్లను సోదా చేసి, సరైన పత్రాలు లేని 72 వాహనాలను సీజ్ చేశారు. కమ్యూనిటీ కనెక్టివిటీ ప్రోగ్రాంలో భాగంగా 100 మందికి పైగా పోలీసులు డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి రవాణా, మట్కా, జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల నిఘా తీవ్రంగా ఉంటుందని, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరారు.
అలగే ఇళ్ల యజమానులు కొత్తవారికి ఇళ్లు అద్దెకు ఇచ్చేముందు వారి ఆధార్ కార్డులు, ఇతర వివరాలను తప్పనిసరిగా సేకరించాలని సూచించారు. అసాంఘిక శక్తుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చే వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. నేరాల నియంత్రణకు ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అత్యవసర సమయాల్లో ‘డయల్ 100’ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ఇన్స్పెక్టర్ సతీష్, టౌన్ ఎస్సైలు నాగరాజు, జీవన్, కళ్యాణి, రూరల్ ఎస్సై సురేష్, ములకలపల్లి ఎస్సై మధు బూర్గంపాడు ఎస్సై ప్రసాద్తో పాటు స్టేషన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.

