కలం, మెదక్ బ్యూరో : తల్లి చేసిన అన్యాయం, తండ్రి అవేశం, పోలీసుల నిర్లక్ష్యం.. ఈ మూడు కారణాల వల్ల ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లా జహీరాబాద్ (Zaheerabad) లో పోలీసుల సమక్షంలో భర్త సిద్ధారెడ్డి తన భార్య కవితను గొంతుకోసి హత్య చేయడం, పోలీసులు తీసుకున్న నిర్లక్ష్య వైఖరి సమాజంలో చర్చనీయాంశంగా మారింది.
మార్చి 27న వివాహిత కవిత (29) చిత్తూరు జిల్లాకు చెందిన ప్రియుడు పవన్తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మిస్సింగ్ అయినట్టు మార్చి 30న భర్త సిద్ధారెడ్డి జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు విచారణలో కవిత ప్రియుడు పవన్తో జడ్చర్లలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. జహీరాబాద్ టౌన్ పోలీసు స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఖాదర్ జడ్చర్ల నుండి కవితను జహీరాబాద్ తీసుకువచ్చేందుకు భర్త సిద్దారెడ్డి ఏర్పాటు చేసిన ప్రైవేటు కారులో కలిసి వెళ్ళాడు.
జడ్చర్ల స్టేషన్లో కవిత, సిద్ధారెడ్డి మధ్య ఘర్షణ జరిగింది. వారిద్దరి మధ్య గొడవ కారణంగా ఆవేశంలో ఉన్న భర్త సిద్ధారెడ్డి అక్కడే ఓ కత్తి కొనుగోలు చేశాడు. సిద్దారెడ్డి మర్డర్ ప్లాన్ను అంచనా వేయకుండా కానిస్టేబుల్ ఖాదర్.. కవిత, సిద్ధారెడ్డిని కారులో కూర్చోబెట్టుకొని జహీరాబాద్కు బయలు దేరాడు. అదే అదునుగా భావించిన సిద్ధారెడ్డి జహీరాబాద్ (Zaheerabad) వస్తున్న మార్గమధ్యలో పోలీసు కారులో ఉండగానే సదాశివపేట (మం) నందికంది వద్దకు రాగానే కత్తితో కవిత గొంతులో పొడిచి హత్య చేసాడు.
పోలీసు వాహనంలో వెళ్తే కవితను వారి వాహనంలోనే తీసుకొని వచ్చేవారు. హత్య జరిగే అవకాశం లేకుండా పోయేది. ప్రైవేటు కారును తీసుకెళ్లడంతో.. కారులోనే సిద్ధారెడ్డి తన భార్యను హత్య చేసే ఆలోచన, అవకాశం, సమయం దొరికింది. అంతేకాకుండా ఇది మహిళ మిస్సింగు కేసుకు సంబంధించి ఫిర్యాదు అయినప్పటికి మహిళ కానిస్టేబుల్ను జడ్చర్లకు పంపకుండా వేరే వారిని పంపించడం కుడా పోలీసుల నిర్లక్ష్య ధోరణిని బయటపెడుతుంది. హత్య జరిగి రెండు రోజులు అవుతున్నా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. హత్య చేసిన సిద్ధారెడ్డిని రిమాండ్కు తరలించారు. సోషల్ మీడియా మోజులో పడి తల్లి కవిత.. ఆవేశంలో హత్య చేసిన తండ్రి సిద్ధారెడ్డి.. కేసు విచారణ సందర్భంగా నిర్లక్ష్యం వహించిన పోలీసుల కారణంగా పిల్లలు అమూల్య (9), అదిత్య (6) అనాథలుగా మిగిలిపోయారు.
Read Also: తెలంగాణ టూరిజం.. సమ్మర్ లో చుట్టేద్దాం
Follow Us On: Instagram

