కలం, వెబ్ డెస్క్: ఇటీవల హైదరాబాద్ (Hyderabad)లో నేరాలు పెరుగుతుండటంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్ల (Rowdy Sheeters)కు డ్రగ్ టెస్టులు (Drug Tests) నిర్వహించారు. ఈ టెస్టుల ఫలితాలు చూసి పోలీసులే షాకయ్యారు. దాదాపు 205 మందికి పరీక్షలు నిర్వహించగా 190 మందికి పాజిటివ్ వచ్చింది. వీరంతా గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంత మందికి పాజిటివ్ రావడంతో గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై తీవ్ర సందేహాలు తలెత్తుతున్నాయి. నగరంలో ప్రస్తుతం 1,300 మందికి పైగా రౌడీ షీటర్లు ఉన్నారు. త్వరలో మిగతా వాళ్లకు కూడా పరీక్షలు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. గంజాయి సరఫరా దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

