కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026లో నేడు అసలైన పోరుకు వేదిక సిద్ధమైంది. వరుసగా మూడు విజయాలతో తిరుగులేని ఫామ్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును (RCB vs RR) ఢీకొట్టబోతోంది. గౌహతిలోని బర్సాపరా స్టేడియంలో శుక్రవారం రాత్రి జరగనున్న ఈ మ్యాచ్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
విజయాల జోరులో రాజస్థాన్..
రియాన్ పరాగ్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్పై వరుసగా విజయాలు సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ వరుస హాఫ్ సెంచరీలతో, వైభవ్ సూర్యవంశీ నిలకడైన ఆటతీరుతో జట్టుకు బలమైన పునాది వేస్తున్నారు.
సత్తా చాటుతున్న బెంగళూరు..
మరోవైపు బెంగళూరు జట్టు కూడా తక్కువ తినలేదు. సన్రైజర్స్ హైదరాబాద్పై 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ, చెన్నైపై 250 పరుగుల భారీ స్కోరు సాధించి ఘనవిజయాలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్లో ముగ్గురు బ్యాటర్లు భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నాయి.
దేవదత్ పడిక్కల్: రాజస్థాన్పై పడిక్కల్కు అద్భుతమైన రికార్డు ఉంది. గత ఏడాది రెండు మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన ఆయన, ఈ సీజన్ మొదటి రెండు మ్యాచ్ల్లోనూ వరుసగా 61, 50 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్నారు.
విరాట్ కోహ్లీ: ఐపీఎల్ రన్ మెషీన్ కోహ్లీ రాజస్థాన్పై ఎప్పుడూ చెలరేగి ఆడుతుంటారు. గతేడాది ఆర్సీబీ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆయన, ఈ సీజన్లోనూ అజేయంగా 69 పరుగులతో రాణించి తన ఫామ్ను నిరూపించుకున్నారు.
వైభవ్ సూర్యవంశీ: కేవలం 15 ఏళ్ల వయసులోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సూర్యవంశీ, ఈ సీజన్ ఆరంభంలోనే మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. అండర్-19 వరల్డ్ కప్లోనూ తన బ్యాటింగ్ పవర్ను చూపించిన ఆయన, రాజస్థాన్కు కీలక ఆటగాడిగా మారారు.

