కలం, వెబ్ డెస్క్ : ప్రాణాలు పోతున్నా.. ప్రజల ఆరోగ్యం నాశనమవుతున్నా కల్తీ డబ్బులకు కక్కుర్తిపడ్డ వాళ్లు అవేమీ పట్టించుకోరు. నోట్ల కట్టల ముందు ప్రజల ఇక్కట్లు వాళ్లకు అవసరం లేదు. ఎందెందు వెతికినా కల్తీనే అనేలా అక్రమార్కులు విజృంభిస్తున్నారు. కొన్నాళ్లుగా నగరంలో కల్తీ ఆహార పదార్థాల కంపెనీల గుట్టు రట్టు చేస్తున్నారు పోలీసులు. ఐస్ క్రీమ్ లు, అల్లం పెస్టు, పాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కల్తీ లిస్టులో ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు కల్తీ ఉస్మానియా బిస్కెట్ల (Osmania Biscuits) తయారీ కేంద్రంపై దాడి చేశారు. హైదరాబాద్ అంబర్పేట్లోని కమలానగర్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఉస్మానియా బిస్కెట్ల తయారీ కేంద్రంపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ చేశారు. అధికారులు తనిఖీల్లో బిస్కెట్లలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు, ఆకర్షణీయమైన రంగుల కోసం కెమికల్స్, నాసిరకం, కుళ్లిపోయిన గుడ్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో కంపెనీ యజమాని మేరాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

