కలం, వెబ్ డెస్క్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తన కొత్త కార్యాలయ ప్రాంగణం సేవ తీర్థ్ నుండి పాలనను ప్రారంభిస్తూ సామాన్యుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలపై సంతకాలు చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దేశంలోని పేదలు, రైతులు, మహిళలు, యువత సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు.
ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించేలా పీఎం రాహత్ పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం కింద రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి 1.5 లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్స అందుబాటులోకి వస్తుంది. మహిళల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడే లఖ్పతి దీదీ పథకం లక్ష్యాన్ని 3 కోట్ల నుండి 6 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నిధులను లక్ష కోట్ల నుండి 2 లక్షల కోట్లకు పెంచడం ద్వారా రైతుల ఆదాయం మెరుగుపడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా యువతను ప్రోత్సహించేందుకు 10 వేల కోట్ల నిధితో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ముఖ్యంగా డీప్-టెక్ పరిశోధనల్లో నిమగ్నమైన స్టార్టప్లకు భారీ ఊతాన్నివ్వనుంది. నాగరిక్ దేవో భవ అనే నినాదంతో సామాన్య పౌరులే దైవంగా భావిస్తూ వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ నిర్ణయాలు మరింత వేగాన్ని ఇస్తాయని మోదీ (Narendra Modi) తన పోస్ట్లో వివరించారు.


