కలం, వెబ్ డెస్క్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఒక ఇన్ ఫ్లుయెన్సర్ కోరికను నెరవేర్చారు. ఈ క్రమంలోనే దేశ ప్రజలకు కూడా కీలక సందేశం ఇచ్చారు. ఇంతకీ ఆయన చేసిందేంటి అనేది ఒకసారి చూద్దాం. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ యువరాజ్ దువా సరదాగా ఒక రీల్ చేశాడు. అందులో తన తండ్రికి షుగర్ ఉన్నట్టు చెప్పాడు. స్వీట్లు తినొద్దని ఎన్ని సార్లు చెప్పినా తన తండ్రి వినట్లేదని.. కాకపోతే ప్రధానమంత్రి మోడీ చెబితే వింటాడని.. తన తండ్రికి మోడీ అంటే చాలా ఇష్టమని యువరాజ్ చెప్పుకొచ్చాడు.
నెక్ట్స్ చేయబోయే మన్ కీ బాత్ లో షుగర్ ప్రభావం గురించి చెప్పాలంటూ ఆ రీల్ లో ప్రధాని మోడీని (Narendra Modi) కోరాడు యువరాజ్ దువా. ఈ రీల్ పై తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. యువరాజ్ రీల్ వీడియోను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. యువరాజ్ దువా తండ్రితో పాటు దేశ ప్రజలంతా షుగర్ ను తగ్గించి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ‘మీ ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టండి. అందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం తినండి. షుగర్ తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఊబకాయం కూడా పెరుగుతుంది. షుగర్ వ్యాధిని తరిమికొట్టాలంటే స్వీట్లకు దూరంగా ఉండండి’ అంటూ నరేంద్ర మోడీ రాసుకొచ్చారు. ఇది కాస్త క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.

