కలం, వెబ్డెస్క్: కర్ణాటక (Karnataka), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఆదివారం తెలంగాణతో పాటు కర్ణాటకలో పర్యటించనున్న నేపథ్యంలో మోదీ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని మోదీ పేర్కొన్నారు. అలాగే ఆదివారం తన పర్యటనకు సంబంధించి పలు వివరాలను మోదీ వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. వివిధ రంగాల్లో సామాజిక సేవ చేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ కృషిని మోదీ కొనియాడారు.
అనంతరం మోదీ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్నారు. సుమారు రూ.9,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో రోడ్లు, రైల్వేలు, టెక్స్టైల్స్, లాజిస్టిక్స్, ఇంధన రంగానికి చెందిన కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే, నగరంలోని సింధు ఆసుపత్రిని జాతికి అంకితం చేయనున్నారు. సాయంత్రం సికింద్రాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష మంది హాజరయ్యేలా జన సమీకరణ చేస్తున్నారు.

