కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని జీడిమెట్ల (Jeedimetla) పారిశ్రామిక ప్రాంతంలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక నిలువ ఉంచిన వేస్ట్ కెమికల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు వారు శ్రమిస్తున్నారు. గోదాంలో రసాయనాలు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని, వాటిని ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఆర్పే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

