కలం, వెబ్ డెస్క్: నేపాల్ (Nepal) రాజధాని ఖాట్మాండులో భారీ ప్రమాదం తప్పింది. ఇస్తాంబుల్ నుంచి త్రిభువన్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టుకు వస్తున్న ఎయిర్బస్-330 విమానంలో మంటలు చెలరేగాయి. విమానం ల్యాండ్ అవుతుండగా, కుడివైపు ల్యాండింగ్ గేర్ వద్ద మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమై విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేసి.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను సురక్షితంగా దింపివేశారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో 270 మందికి పైగా ప్రయాణికులున్నట్లు సమాచారం. అందరూ సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.
విమానాశ్రయం మూసివేత.. విచారణకు ఆదేశం..
ఈ ఘటన ఉదయం 6.14 గంటలకు చోటు చేసుకోగా.. గంటన్నర పాటు విమానాశ్రయాన్ని పూర్తిగా మూసేసి.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు సివిల్ ఏవీయేషన్ శాఖ ప్రకటించింది. ఉదయం పూట మంచు కారణంగానే ల్యాండ్ చేసే క్రమంలో ఇది చోటు చేసుకున్నట్లు పేర్కొంది.

