కలం, మెదక్ బ్యూరో : రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లాలో సాఫీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని మెదక్ (Medak) జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. కొల్చారం మండల కేంద్రంలోని ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని ఆమె సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అన్ని సౌకర్యాలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. రవాణాలో జాప్యం లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
అన్లోడింగ్ లో సమస్యలు తలెత్తుకుండా మిల్లర్లు సమన్వయంగా వ్యవహరించాలని సూచించారు. కొల్చారం మండల కేంద్రంలో ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకు 13 లారీల ధాన్యం సత్య సాయి రైస్ మిల్లుకు తరలించినట్లు తెలిపారు. ఈ సెంటర్లో హమాలీల కొరత లేదన్నారు. క్షేత్రస్థాయిలో సివిల్ సప్లై అధికారులు కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శిస్తూ.. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు.

