కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం (Lakshmipuram) గ్రామంలో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక లారీ యార్డు సమీపంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం, బీహార్ రాష్ట్రానికి చెందిన కుందన్ సింగ్ అనే వలస కార్మికుడు లక్ష్మీపురంలోని ‘రాయల్ ఆటో పోర్ట్స్’ గదిలో ఇతర కార్మికులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవ క్రమంగా హింసాత్మకంగా మారి, నిందితులు కుందన్ సింగ్పై విచక్షణారహితంగా దాడి చేశారు.
బండరాయితో తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నపాటి వివాదమే మద్యం మత్తులో ప్రాణాంతక ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే బూర్గంపాడు ఎస్సై మేడ ప్రసాద్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ యార్డులు, గ్యారేజీలలో పనిచేసే వలస కార్మికుల మధ్య తరచూ ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు మరింత నిఘా పెంచాలని వారు కోరుతున్నారు.

