కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మెయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వివాదాలకు సెంట్రిక్ గా మారిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి( Pilot Rohit Reddy) ఫాంహౌస్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు అసైన్డ్ భూమిలో ఫాంహౌస్ కట్టారని అధికారులు తేల్చారు. ఇదిలాఉంటే పార్టీకి వచ్చిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. రోహిత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నాక.. ఫాంహౌస్ లోనే పోలీసులు విచారణ చేయనున్నారు.
కాగా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్లో కొకైన్(Cocaine) కలకలం రేపిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్(Rangareddy District Mainabad)లో ఈగల్ టీమ్(Eagle Team) చేసిన దాడుల్లో 2 గ్రాముల కొకైన్ లభ్యమైంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ మహేష్ సహా మెుత్తం 11 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. రోహిత్ రెడ్డి, మహేష్ సహా మరో నలుగురికి డ్రగ్స్ పాటిజివ్గా తేలింది. ప్రస్తుతం మహేష్ బెయిల్పై బయట ఉండగా.. ఫాంహౌస్లో కాల్పులకు కూడా పాల్పడినందుకు రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపారు. పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ, కాల్పుల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ చీఫ్గా మొత్తం 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయగా.. సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా రోహిత్ రెడ్డికి ఉన్న లింక్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హైదరాబాద్లోనే డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది.

