కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని ప్రముఖ ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital)లో ఓ యువ వైద్యుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. సర్జరీ విభాగంలో మొదటి సంవత్సరం పీజీ చదువుతున్న సురేశ్ (26) అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం వైద్య వర్గాల్లో విషాదాన్ని నింపింది. కేవలం మూడు నెలల క్రితమే సురేశ్ ఈ విభాగంలో విధుల్లో చేరారు.
గురువారం ఉదయం సురేశ్ తన గది తలుపులు ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ సురేశ్ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి వెంటనే క్యాజువాలిటీకి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు తోటి వైద్యులు ధ్రువీకరించారు. నిద్రమాత్రలతో పాటు ఓవర్ డోస్ ఇంజక్షన్ తీసుకోవడం వల్లే సురేశ్ మరణించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి (Osmania Hospital) చేరుకుని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు పని ఒత్తిడినా లేక వ్యక్తిగత సమస్యలా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also: సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత.. కలెక్టర్ ముందే మహిళ ఆత్మహత్యయత్నం
Follow Us On : WhatsApp

