కలం, వెబ్ డెస్క్ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి (Medipally) వద్ద హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం ప్రమాదం జరిగింది. పెట్రోల్తో నిండిన హెచ్పీ ట్యాంకర్ లారీ అదుపుతప్పి ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నంబర్–102ను ఢీకొట్టింది. లారీ డ్రైవర్ ముందున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ట్యాంకర్ ముందు భాగం దెబ్బ తినగా.. డ్రైవర్ కు స్వల్ప గాయలయ్యాయి. డ్రైవర్ ను స్థానికులు వెంటనే సమీపంలోని అపెక్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
అయితే ప్రమాద సమయంలో అదృష్టవశాత్తూ ట్యాంకర్ నుంచి ఎలాంటి ఇంధన లీకేజీ కాలేదని.. లేదంటే మంటలు చెలరేగి పరిస్థితి విషమంగా మారే అవకాశం ఉండేదని స్థానికులు అంటున్నారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగి ఉండేదని చెబుతున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

