కలం, వెబ్ డెస్క్ : ఖమ్మం (Khammam) జిల్లా సత్తుపల్లిలోని (Sathupalli) గిరిజన బాలికల హాస్టల్లో అర్ధరాత్రి జరిగిన ఘటన కలకలం రేపింది. హాస్టల్ గదిలోకి సుమారు 12 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ (Python) చొరబడటంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఇద్దరు విద్యార్థినుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి సమయంలో గదిలో బుసలు శబ్దం వినిపించడంతో ఇద్దరు విద్యార్థినులు మేల్కొన్నారు. అనుమానం వచ్చి పరిశీలించగా గదిలో భారీ కొండచిలువ కనిపించింది. వెంటనే వారు ధైర్యంగా వ్యవహరించి గది తలుపులు మూసివేసి హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న స్థానికులు, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేశారు. అనంతరం రిటైర్డ్ అటవీ శాఖ ఉద్యోగి మహమ్మద్కు సమాచారం ఇవ్వగా, ఆయన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. తర్వాత ఆ కొండచిలువను సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో హాస్టల్లోని విద్యార్థినులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థినుల సమయస్ఫూర్తి, ధైర్యసాహసాల వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అభినందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం కాగా, వర్షాకాలంలో పాములు జనావాసాలలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Read Also: దాంపత్య బంధం బలపడాలంటే ప్రతి జంట పాటించాల్సిన టిప్స్ ఇవే!
Follow Us On : WhatsApp

