కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల (Jadcherla) నియోజకవర్గంలో ఈ నెల 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జడ్చర్ల నుంచి గంగాపూర్కు వెళ్లే మార్గంలో ఉన్న స్థలాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ స్వయంగా పరిశీలించి, బహిరంగ సభ ప్రదేశాన్ని ఖరారు చేశారు.
సభ నిర్వహణకు సంబంధించి భద్రత, రవాణా, ప్రజల సౌకర్యాలు, సభకు వచ్చే వారికి తాగునీరు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. బహిరంగ సభకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ జానకి, వివిధ శాఖల అధికారులు తదితర అధికారులు కూడా పాల్గొన్నారు.

