కలం, హనుమకొండ : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగ యువతను మోసం చేసిన వ్యక్తిని బుధవారం కాజీపేట (Kazipet) పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మెట్టు ప్రవీణ్కుమార్ (41).. ఇన్కమ్ ట్యాక్స్ శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్, ఎన్ సీ సీ కోటా పేరుతో అభ్యర్థులను ఆకర్షించిన నిందితుడు.. గతంలో జారీ అయిన నియామక ఉత్తర్వుల్లో పేర్లు మార్చి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ పత్రాలు, తయారు చేసి చూపించినట్లు వెల్లడైంది.
అంతేకాకుండా మెడికల్ టెస్టులు, పోలీస్ వెరిఫికేషన్ జరుగుతున్నట్లు నమ్మించి మోసానికి పాల్పడ్డాడు. ఇప్పటివరకు గుర్తించిన బాధితుల నుంచి సుమారు రూ.85 లక్షల నగదు, 4 తులాల బంగారం వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల అసలు స్టడీ సర్టిఫికెట్లు, ఉద్యోగ సంబంధిత పత్రాలను కూడా తీసుకున్నాడు. నిందితుడి నుంచి సుమారు రూ.18.22 లక్షల విలువైన నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
ల్యాప్టాప్, మారుతి బ్రెజ్జా కారు, రూ.2 లక్షల నగదు, ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఇతర మొబైల్ ఫోన్లు, నకిలీ నియామక పత్రాల తయారీ సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు. కాజీపేట ఏసీపీ పి. ప్రశాంత్రెడ్డి ఆదేశాల మేరకు, సీఐ జె. శ్యామ్సుందర్ పర్యవేక్షణలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

