కలం, స్పోర్ట్స్: రాబోయే ఆసియా గేమ్స్లో (Asian Games 2026) పతకాలే లక్ష్యంగా భారత రెజ్లింగ్ జట్టు ముమ్మరంగా సిద్ధమవుతోంది. సీనియర్, జూనియర్ రెజ్లర్లు కలిసి సాధన చేస్తూ మెరుగైన ప్రదర్శన కోసం శ్రమిస్తున్నారు. గత మూడు నెలలుగా జట్టంతా కలిసి శిక్షణ పొందుతున్నట్లు స్టార్ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ (Antim Panghal) తెలిపారు. సీనియర్ ఆటగాళ్లు తమ అనుభవంతో జూనియర్లకు మార్గనిర్దేశం చేస్తున్నారని ఆమె చెప్పారు. తమ లోపాలను గుర్తించి సరిదిద్దుకోవడంతో పాటు మ్యాట్పై పదేపదే సాధన చేస్తూ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నట్లు వెల్లడించారు. జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదని, ప్రశాంతంగా పూర్తి దృష్టితో శిక్షణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
స్వర్ణమే లక్ష్యం
ఆసియా గేమ్స్లో ప్రతి ఒక్కరూ స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారని అంతిమ్ పంఘాల్ తెలిపారు. నాలుగేళ్లకోసారి జరిగే ఆసియా గేమ్స్కు తమ జట్టు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పోటీల సమయంలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. గత హ్యాంగ్జౌ ఆసియా గేమ్స్లో భారత రెజ్లర్లు మూడు కాంస్య పతకాలకే పరిమితమయ్యారు. ఈసారి ఆ ప్రదర్శనను మెరుగుపరచి ఎక్కువ పతకాలు సాధించాలని భారత రెజ్లింగ్ బృందం పట్టుదలతో ఉంది.
కొత్త చరిత్రపై కన్ను
జపాన్లోని ఐచి-నాగోయాలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా గేమ్స్ జరగనున్నాయి. గతంలో భారత్ అత్యధికంగా 107 పతకాలు సాధించింది. ఈసారి ఆ రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు.

