కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ లో థియేటర్స్ సమస్య చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లు పర్సెంటేజ్ విధానంలో అయితేనే రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజ్ చేస్తామని అల్టిమేటం చేయగా.. నిర్మాతలు మాత్రం రెంటల్ విధానమే కావాలంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాజమహేంద్రవారంలో పలువురు తెలుగు సినీ నిర్మాతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను కలిశారు. ఈ సమావేశంలో నిర్మాతలు శ్రీ వై. రవిశంకర్, శ్రీ సూర్యదేవర నాగవంశీ, శ్రీ సాహు గారపాటి, శ్రీ కిలారు వెంకట సతీష్, శ్రీ చెరుకూరి సుధాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సంబంధిత విషయాలపై చర్చించారు. సమావేశం అనంతరం నిర్మాతలు కీలక ప్రకటన చేశారు. పెద్ధి సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బందులు లేవని వెల్లడించారు. ఇండస్ట్రీ సమస్యలు త్వరలో పరిష్కారిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

